తనంతట తాను బాధ్యతలు స్వీకరించారు
హైకోర్టు కాల వ్యవధి చెప్పలేదు
హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తున్నాం
మీడియా సమావేశంలో ఏజీ సుబ్రహ్మణ్య శ్రీరామ్ వెల్లడి
అమరావతి: రాష్ట్ర ఎన్నికల అధికారిగా (ఎస్ఈసీ) తిరిగి బాధ్యతలు చేపట్టినట్లుగా నిమ్మగడ్డ రమేష్ కుమారే ప్రకటించుకున్నారని ఏపీ అడ్వకేట్ జనరల్ (ఏజీ) ఎస్.సుబ్రహ్మణ్య శ్రీరామ్ అన్నారు.
శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు హైకోర్టు జడ్జిమెంట్ కాపీ వచ్చింది. ఎస్ఈసీగా కొనసాగమని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు హైకోర్టు నేరుగా ఎక్కడా చెప్పలేదన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం తనంతట తానే బాధ్యతలు స్వీకరించినట్లుగా సర్క్యూలర్ విడుదల చేశారు.
సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగిందని ఏజీ తెలిపారు. అప్పటివరకు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కూడా కోరామని వివరించారు. రాష్ట్ర ఎన్నికల అధికారిని నియమించే అధికారం రాష్ట్రానికి లేదు అంటే.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కూడా ఈ నిబంధనే వర్తిస్తుందని ఆయన అన్నారు.
అలాంటప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ప్రభుత్వం ఎలా నియమిస్తుంది? అని సుబ్రహ్మణ్య శ్రీరామ్ అన్నారు. నిమ్మగడ్డ ను కూడా అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు సలహా మేరకే నియమించారు. గవర్నర్ నిర్ణయంలో మంత్రి మండలి సలహా అవసరం లేదంటే.. అప్పటి సీఎం చంద్రబాబు ఇచ్చిన సలహా కూడా చెల్లదన్నారు. ఎలా చూసుకున్నా ఆయన నియామకం కూడా చెల్లదు అన్నారు.
హైకోర్టు తీర్పులో కాలవ్యవధి స్పష్టంగా చెప్పకుంటే.. రెండు నెలల కాలవ్యవధి ఉంటుందని ఏజీ అన్నారు. హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ స్వీయ నియామకం చేసుకునే అధికారం లేదని స్పష్టం చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర, జిల్లా అధికారులకు ఒక సర్కులర్ జారీ చేశారు. విజయవాడ కార్యాలయం నుంచి సర్క్యూలర్ విడుదల చేసి.. హైదరాబాద్లోని తన ఇంటికి వాహనాలు పంపించాలన్నారు.
ఎస్ఈసీ స్టాండింగ్ కౌన్సిల్ గా ఉన్న ప్రభాకర్ ను రేపటిలోగా రాజీనామా చేయమని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారని ఆయన వివరించారు.ఈ విషయం ప్రభాకర్ తనకు ఫోన్ చేసి చెప్పారని ఏజీ తెలిపారు. తనకు కొంత సమయం కావాలని ప్రభాకర్, నిమ్మగడ్డను కోరారు. అయినా విన్పించుకోకుండా నిమ్మగడ్డ మాత్రం రేపటిలోగా రాజీనామా చేయాలని ఆదేశించారు
ఇప్పటికే స్టే ఇవ్వాలని ప్రభుత్వం హైకోర్టును కోరిందని, ఎస్ఈసీ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్తున్నామని చెప్పారు. హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకం కూడా చట్ట విరుద్ధమన్నారు. హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వీయ నియామకం చేసుకునే అధికారం లేదని ఏజీ పేర్కొన్నారు.
సాధారణంగా ప్రభుత్వ న్యాయనిపుణులు ఎప్పుడూ మీడియా ముందుకు రారు.. కానీ ఇది రాజ్యాంగ అంశాలు, హైకోర్టు తీర్పుతో కూడినందున మీడియా ముందుకు రావాల్సివచ్చిందని ఏజీ సుబ్రహ్మణ్య శ్రీరామ్ వివరించారు. ఈ మీడియా సమావేశంలో సీఎం కార్యాలయం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పాల్గొన్నారు.