సమీక్షించిన సీఎం జగన్
తాడేపల్లి: లాక్ డౌన్ కారణంగా సుమారు 30 రోజుల పాటు పనులు ఆగిపోయాయని పోలవరం ప్రాజెక్టు ఇంజనీర్లు తెలిపారు. ఇప్పుడిప్పుడే సిమెంట్, స్టీలు రావడంతో తిరిగి పనులు మొదలు పెట్టామన్నారు.
ఇవాళ పోలవరం పనులపై సీఎం వైఎస్.జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళి, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు పాల్గొన్నారు.
కోవిడ్–19 నేపథ్యంలో సిమెంటు, స్టీల్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని అధికారులు వివరించారు. నెల రోజులకు పైగా అత్యంత విలువైన సమయం కోవిడ్ కారణంగా పోయిందన్నారు. ఏప్రిల్ 20 నుంచి కాస్త పరిస్థితులు మెరుగుపడ్డాయని అన్నారు. ఇప్పుడిప్పుడే సిమెంటు, స్టీల్ సరఫరా మొదలవుతోందన్నారు.
సిమెంటు, స్టీల్ సరఫరా ఇబ్బందులు రాకుండా చూడాలని సీఎం ఆదేశించారు. స్పిల్వే జూన్ నెలాఖరు పూర్తిచేయడానికి ప్రయత్నాలు చేయాలన్నారు. ప్రాజెక్టు పనులకు సంబంధించి ప్రతి పనికి కూడా సూక్ష్మస్థాయిలో కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు.
గత సంవత్సరం గోదావరి వరదలను చూశామని, ముంపునకు గురైన ప్రతి కుటుంబాన్నికూడా శరవేగంతో తరలించాలి సీఎం సూచించారు. వారికి సంబంధించిన సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టాల్సిందేనన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న అవుకు టన్నెల్–2, వలిగొండ, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, వంశధార–నాగావళి లింకు పనులపైనా సీఎం సమీక్షించారు. నిర్దేశించుకున్న కాలంలోగా పనులు పూర్తికావాలని కోరారు. 2020లో ఈ 6 ప్రాజెక్టులు తప్పనిసరిగా ప్రారంభం అవుతాయని అధికారుల సీఎం జగన్ కు హామీ ఇచ్చారు.