లాక్డౌన్ ఆంక్షలు సడలించారు. జనం ఎవరి పనిలో వారు ఇపుడిపుడే నిమగ్నమవుతున్నారు. ఏపీ, పశ్చిమబెంగాల్ మినహా మిగిలిన రాష్ట్రాలు విమానాలకు ద్వారాలు తెరిచాయి.
మూడు నెలల వ్యవధిలో లక్ష కరోనా కేసులు నమోదైతే.. రాబోయే కొద్దిరోజుల్లోనే ఈ సంఖ్య రెట్టింపు చేరవచ్చనే ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. బిహార్లో కేర్ ఇండియా చేపట్టిన అధ్యయనంలో విస్మయం గొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఏపీ, తెలంగాణలోనూ వారం వ్యవధిలో కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఇవన్నీ సూపర్ స్ప్రెడర్స్ ద్వారానే అంటున్నారు అధికారులు. మే నెలాఖరు నాటికి తీవ్రత పెరుగుతుందని గట్టిగా నమ్ముతున్నారు. ఇంతే వేగంగా కరోనా వైరస్ విస్తరించుకుంటూ పోతే.. తెలుగు రాష్ట్రాలతోపాటు యావత్ భారతం లో కేసుల సంఖ్య రెండున్నల లక్షలకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు.
వాస్తవానికి జూన్ చాలా కీలకం… విద్యా సంవత్సరం మొదలవుతుంది. వర్షాకాలం ఆరంభం. ఉద్యోగుల బదిలీల సమయం కూడా.. ఇటువంటి సమయంలో విచ్ఛలవిడిగా రాకపోకలు పెరగటం వల్ల వైరస్ తేలికగా వ్యాపిస్తుంది. వైద్యాధికారుల అంచనా ప్రకారం ఒకే వ్యక్తి ద్వారా 50-60 మంది వైరస్ భారిన పడిన వారూ ఉంటున్నారు. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, కర్నూలు వంటి అధిక జనాభా ఉన్న నగరాల్లోనూ మొదట ఒక్క కేసు ద్వారానే వ్యాపించాయి. మొదట్లో చేసిన నిర్లక్ష్యానికి ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నామనేది జగమెరిగిన సత్యం. అటువంటి వ్యాధులు, అంటువ్యాధులు వ్యాపించే వర్షాకాలం ఇంకెంతగా వైరస్ జనజీవితాన్ని ప్రభావితం చేస్తుందనేది ఇప్పుడు పాలకుల ముందున్న సవాల్.