హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల వైద్య సేవలు పూర్తి ఉచితంగా పేదలకు అందించడమే మా లక్ష్యమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఖరీదైన శస్త్ర చికిత్సలు ఉచితంగా అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
ఇవాళ హైదరాబాద్ లో 8 డయాగ్నొస్టిక్ మినీ హబ్ లను నగరంలో ప్రారంబించారు. లాలాపేటలోని లాలపేటలోని అర్బన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో మినీ హబ్ ను మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అతి త్వరలో మరో ఎనిమిది హబ్ లను సిద్దం చేస్తామని మంత్రి రాజేందర్ తెలిపారు. బస్తి దవాఖానలో ఏదైనా టెస్ట్ లు అవసరం ఉంటే వెంటనే టెస్ట్ లు చేసేందుకు ఈ డయాగ్నొస్టిక్ కేంద్రాల ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ ఎక్స్ రే, ఈసీజీ, అల్ట్రా సౌండ్ తీస్తారన్నారు. రిపోర్టులు కూడా ఆన్ లైన్ లో మెయిల్ కు పంపిస్తామన్నారు. పేదలు వైద్య పరీక్షల కోసం వేల రూపాయలు ఖర్చు చేసే అవసరం లేకుండా చేసేందుకే ఈ డయాగ్నొస్టిక్ సెంటర్స్ ఏర్పాటు చేశామని రాజేందర్ తెలిపారు.
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో 8 అధునాతన ఆపరేషన్ థియేటర్ లతో అవయవ మార్పిడి సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఆధునిక సౌకర్యాలు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. హైదరాబాద్ లో డయాగ్నస్టిక్ ల్యాబ్ లు విజయవంతం అయితే… జిల్లాల్లోనూ అవసరం అయిన చోట ఏర్పాటు చేస్తామని మంత్రి రాజేందర్ అన్నారు.