ఆయన ఏమైనా గాంధీనా? పూలేనా?
అరెస్ట్ చేస్తే కులం కార్డు అంటగడతారా?
అమరావతి: మాజీ కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు టీడీపీ హయాంలో మందుల కొనుగోళ్లలో దాదాపు రూ.150 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు.
అవినీతి ఆరోపణలపై అచ్చెన్నాయుడును అరెస్ట్ చేస్తే బీసీలపై దాడిగా టీడీపీ ప్రచారం చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. పైగా కుల రాజకీయాలు చేయటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈఎస్ఐలో తవ్వేకొద్ది గుట్టలు గుట్టలుగా అవినీతి పుట్టలు బయట పడుతున్నాయని వారు అన్నారు. వైసీపీ పార్టీ బీసీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు మీడియాతో మాట్లాడారు.
కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్
అచ్చెన్నాయుడు అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడరు. గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రులు అవినీతికి పాల్పడ్డారనే దానికి అచ్చెన్నాయుడే ఉదంతమే నిదర్శనం. త్వరలో టీడీపీ హయాంలో వివిధ శాఖల్లో అవినీతి చేసిన మంత్రులు కూడా బయటపడతారు. అచ్చెన్నాయుడు టెలీసర్వీస్ , ఆర్సి, నాన్ ఆర్సి ద్వారా అవినీతికి పాల్పడ్డారు.
హోంమంత్రి ఎం.సుచరిత
అచ్చెన్నాయుడు అక్రమాలకు పాల్పడితే నన్ను రాజీనామా చేయమనటం ఏంటో చంద్రబాబుకే తెలియాలి. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఎందుకలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఈఎస్ఐలో భారీ స్కాం జరిగిందనేది వాస్తవమని .. ఆధారాలలు దొరికాకనే అవినీతిపరులను అరెస్టు చేయటం జరిగింది. రూ.లక్ష విలువ చేసే సోఫాని రూ.10 లక్షలకి కొనుగోలు చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టులు ఉంటాయి.
మంత్రి మోపిదేవి వెంకటరమణ
టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా ప్రత్యేకించి అక్రమ మార్గంలో ప్రజాధనాన్ని కొల్లగొట్టాలని చూస్తుంది. ప్రభుత్వ సంపాదన ఎలా కొల్లగొట్టాలన్న దాంట్లో టిడిపి నేతలకు మించిన సిద్దహస్తులు. అందువల్ల టిడిపి హయాంలో ఇలాంటి స్కాంలు కోకొల్లలుగా ఉంటాయి. అచ్చెన్నాయుడు తీసుకున్న నిర్ణయాలపై పలు కోణాల్లో ఎసిబి విచారణ చేసింది. అచ్చెన్నాయుడు బిసి నాయకుడంటే ఒప్పుకోరని ఆయన అగ్రవర్ణ బిసి.
మంత్రి అనిల్ కుమార్ యాదవ్
అచ్చెన్నాయుడు అవినీతికి బీసీలకు ఏం సంబంధం లేదు. తప్పు చేశాడని ఆధారాలున్నాయి కాబట్టే అరెస్ట్ చేశారు. బీసీలను 30 ఏళ్ళు మోసం చేసిన వ్యక్తి చంద్రబాబే. బాబు పాలనలోని ప్రతి అవినీతిపైనా విచారణ జరిపిస్తాం. యాదవులకు దేవాలయాల్లో వారసత్వ హక్కు కల్పించిన ఘనత సీఎం జగన్ దే. చంద్రబాబు, లోకేశ్ అవినీతిపై కూడా సీబీఐ విచారణ జరిగితే వారికి శిక్ష తప్పదు.
మంత్రి శంకరనారాయణ
అవినీతిపరుడైన మాజీ మంత్రిని అరెస్ట్ అయితే కులం కార్డు అంటగట్టడం సిగ్గుచేటు. అచ్చెన్నాయుడు ఏమైనా మహాత్మా గాంధీనా, లేక పూలేనా. ఈఎస్ఐ స్కాంలో ఇప్పటివరకు దొరికింది చిన్నపాములేనని, ఇందులో చంద్రబాబు పాత్ర ఎంత, లోకేశ్ పాత్ర ఎంత అనేది లెక్క తీస్తున్నారు.
ఆర్కే రోజా, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్
అవినీతి చేసి ఆధారాలతో దొరికాడు కాబట్టే అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యారు. చంద్రబాబు సిగ్గు లేకుండా మాపై విమర్శలు చేస్తున్నారు. జగన్ కక్ష సాధించాలనుకుంటే చంద్రబాబును, లోకేశ్ని లోపలేయించే వారు. త్వరలో చంద్రబాబు, లోకేశ్ అవినీతిపై సీబీఐ విచారణ జరుగుతుంది. అడ్డగోలుగా దోచుకున్న తండ్రి, కొడుకులు జైలుకి వెళ్లక తప్పదు.
మహమ్మద్ ఇక్బాల్, ఎమ్మెల్సీ
విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఎసిబి అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారు. చట్టం ముందు అందరూ సమానులే. చట్టానికి కులాలు, మతాలతో సంబంధం లేదు. ఎసిబి విచారణకు టీడీపీ సహకరించాలి.