ఏపీ రాజకీయం ఇప్పుడు అంతా హైదరాబాద్ నగరంలోని పార్క్ హయత్ హోటల్ చుట్టూ తిరుగుతోంది. ఏపీ మాజీ ఎన్నికల అధికారి టీడీపీ ఏజెంటుగా పనిచేశారని ఆరోపిస్తూ వైసీపీ ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్కుమార్ను పదవినుంచి తొలగించింది. వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కొత్త ఎన్నికల అధికారిని కూడా నియమించింది. అయితే, రమేష్కుమార్ దీనిపై హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు అతడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. వెంటనే ఆయనను విధుల్లో తిరిగి నియమించాలని కూడా ఆదేశించింది.
కానీ, ఏపీ సర్కారు ఆ ఆదేశాలను పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో న్యాయపోరాటం చేస్తున్న రమేష్కుమార్ ఇటీవల హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఉన్న పార్క్ హయత్ హోటల్లో బీజేపీ ఎంపీ సుజనాచౌదరి, ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత కామినేని శ్రీనివాస్తో భేటీ అయ్యారు. పార్క్ హయత్ హోటల్లో వీరు భేటీ అయ్యారని, కుట్రలకు ఇదే నిదర్శనం అని, వీరంతా భేటీ కావడం వెనుక చంద్రబాబు హస్తం ఉందని అధికార వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. దీనికి సంబంధించి కొన్ని సీసీ టీవీ పుటేజీలను కూడా బయటపెట్టారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, ఆ హోటల్లో నిమ్మగడ్డ రమేష్కుమార్తో పాటు సుజనాచౌదరిని వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కలిశారట. దీనికి సంబంధించిన సీసీ టీవీ పుటేజీలు కూడా వైసీపీ అధిష్టానానికి చేరాయట. దీంతో ఆ పార్టీలో ఇప్పుడు అది హాట్ టాపిక్గా మారడంతో పాటు ఆ పార్టీ నేతలు కలవరపడుతున్నారట. వాస్తవానికి నిమ్మగడ్డ రమేష్కుమార్కు సంబంధించిన సీసీ టీవీ పుటేజ్లు దొరికినప్పుడే వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలవి కూడా లభించాయని, కాకుంటే వాటిని ఎడిట్ చేసి మీడియాకు పంపారని జోరుగా చర్చ సాగుతోంది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ప్రతిసారీ తలకిందులవుతున్న వైసీపీ అంచనాలు ఇప్పుడు ఏకంగా గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా తయారయ్యాయని ఆ పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ భేటీకి ఎందుకు వెళ్లారు. తమ కష్టాలను, ఇబ్బందులను చెప్పుకునేందుకు వెళ్లారా.. లేక, వీరంతా బీజేపీలోకి వెళ్లేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారా అన్న అనుమానంతో వైసీపీ నేతలకు నిద్ర పట్టడం లేదట. అయితే, ఇందులో ఎంత వాస్తమముందో తెలియాలంటే మరికొంత కాలం ఆగక తప్పదు మరి.