అమరావతి: ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈనెల మూడోవారంలో ప్రారంభంకానున్నాయి.
ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో శుక్రవారం కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలను అనుసరించి శాసనసభను ఎలా నిర్వహించాలనే అంశంపై సమావేశం జరిగింది. రాజ్యసభ సభ్యుల ఎన్నిక కోసం ఈనెల 19న పోలింగ్కు ఎమ్మెల్యేలు రావాల్సి ఉన్నందువల్ల ఆ రోజుకు అటూఇటుగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించడంపై ప్రధానంగా చర్చ జరిగింది.
ఈ నెల 13 లేదా 16న సమావేశాలను ప్రారంభించటంపై తొలుత చర్చించారు. 19వ తేదీ నుంచే ప్రారంభిస్తే 26 వరకు కొనసాగించవచ్చన్న ప్రతిపాదనపై అభిప్రాయాలు తీసుకున్నారు. సుమారు వారం రోజులపాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. అయితే కచ్చితమైన తేదీని నేడో రేపో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
ఈ సమావేశంలో శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి, విప్ శ్రీనివాసులు పాల్గొన్నారు.